డాక్టర్‌ కందేపి రాణిప్రసాద్‌ కవయిత్రి. బాలసాహితీవేత్త. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ తెలుగు సాహిత్యం చదివి అదే కాకతీయ విశ్వవిద్యాలయ దూర విద్యా కేంద్రం ,సిరిసిల్లలో 10 సంవత్సరాలు లెక్చరర్ గా పని చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి తెలుగు బాలసాహిత్యం- విజ్ఞాన శాస్త్ర రచనలు అన్న అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. అదే నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి జంతు శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ తీసుకున్నారు. వార్తా దిన పత్రికలో బాలలకోసం 1996 నుంచి 2007 వరకు సరదా సరదా బొమ్మలు శీర్షికను నిర్వహించారు. బాలతేజం పిల్లల మాసపత్రిలో 1999 నుంచి 2009 వరకు సైన్స్ పాయింట్ శీర్షికను నిర్వహించారు.నది పత్రికలో పిల్ల కెరటాలు శీర్షికన సంవత్సరం పాటు మెజిటబుల్ కార్వింగ్ వ్యాసాలు రాశారు. మొలక బాలల మాసపత్రికలో నాలుగు సంవత్సరాలు వెజిటబుల్ కార్వింగ్ వ్యాసాలను చేసి చూద్దాం శీర్షికన రాశారు. బాల బాటలో ఇలా చేద్దాం శీర్షికలో బొమ్మల తయారీ వ్యాసాలు రాస్తున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి శ్రీ అంగలకుదిటి సుందరాచారి స్మారక బాల సాహిత్య పురస్కారాన్ని 2012 నుంచి అందిస్తున్నారు. సృజన్ పిల్లల హాస్పిటల్ లో పిల్లల కోరకు బాలసాహిత్య లైబ్రరీని ఏర్పాటు చేశారు.

Leave a comment